ఎన్నిప్రాణాలను బలితీసుకున్నా
ఎన్నిగుండెలు ఆవిరైనా
ఎన్ని కడుపుకోతల చవిచూసినా
ఇంకా కళ్ళు తెరవక చూస్తున్నాo చోద్యం..
అభం శుభం ఎరుగని పసిపువ్వులు ఎన్నో.
నరకబాధ చవిచూసి అంతరించిపోతున్నా
భయానక ఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతమవుతున్నా...
ఎదుర్కున్న ప్రతిసారీ ఏడుస్తూ
గడిచాక మళ్ళీ మైమరుస్తూ
నిర్లక్ష్యాలకు మూల్యంగా
అమ్మల ఆక్రందనలను చెల్లించి
సేదతీరుతున్నాయి అందలమెక్కిన
అధికారపు వైఫల్యాలు.....!!
పంటపొలాలకోసం వేసిన బోర్లు
కష్టం తీర్చకపోగా మరింత నష్టాన్ని
పూడ్చలేని శోకాన్ని అందిస్తూ
వేదన నిండిన గుండెల గునపాలుగా
మానని గాయాలు చేస్తున్నాయి....
పంటకై పడిన ఆరాటం
కడుపు పంటను దోచుకుని వేళుతుంటే దిక్కుతోచక దీనంగా చూసి భరిస్తూ
కడివెడు కన్నీళ్ళుగా ఆశల్ని వదులుకుని
కరువు తీరని బెంగని అరువుకి తెచ్చుకుని
రోదించే హృదయాలకు విశ్రాంతి ఎప్పుడో..
పసిమొగ్గలని ఏరుకునే దేవుడికి
నిర్లక్ష్యంగా నిద్రించే కన్నవాళ్ళకు
కళ్ళుమూసి చూస్తున్న నేతలకు
చైతాన్యాన్ని వదిలిన మనకే తెలియాలి...!!
అనుశ్రీ....

No comments:
Post a Comment